గోవా రాజధాని పనాజీలో రాష్ట్ర తృణమూల్ కాంగ్రెస్ (TMC)నేతలతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జి భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ గోవా కూడా తనకు మాతృభూమేనని తెలిపారు. లౌకికవాదాన్ని విశ్వసిస్తానని.. జాతి సమైక్యతను నమ్ముతానన్నారు. భారత దేశం మన మాతృభూమి అన్న మమత.. బెంగాల్ కూడా నాకు మాతృభూమే అవుతుందన్నారు. బెంగాల్ చాలా బలమైన రాష్ట్రమన్నారు. భవిష్యత్తులో గోవాను కూడా తాము బలమైన రాష్ట్రంగా చూడాలనుకుంటున్నామని చెప్పారు మమతా బెనర్జీ.
బెంగాల్కు చెందిన పలువురు మమతాబెనర్జీ TMC పార్టీ గోవాలో ఎలా పోటీచేస్తుందని అంటున్నారని, తాను భారతీయురాలిని కాబట్టి ఎక్కడి నుంచైనా పోటీచేసే అధికారం తనకు ఉందని స్పష్టం చేశారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మమతా ఇవాళ(శుక్రవారం) గోవాకు చేరుకున్నారు.. ఆదివారం వరకు అక్కడే ఉండనున్నారు.